ఇరాన్‌కు భారత్ మానవతా సాయం

  • యుద్ధం కారణంగా ఆసుపత్రుల్లో మందుల కొరత
  • మందులతో పాటు అత్యవసర వైద్య సామాగ్రి పంపిన కేంద్రం
  • భారత ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలంటూ ఇరాన్ ప్రకటన
అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇరాన్‌కు భారత్ మానవతా దృక్పథంతో అండగా నిలిచింది. యుద్ధం కారణంగా మందుల కొరతతో అల్లాడుతున్న ఆ దేశానికి అత్యవసర వైద్య సామాగ్రితో కూడిన తొలి విడత సాయాన్ని అందించింది. ఈ సహాయం ఇరాన్‌కు చేరినట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. కష్టకాలంలో ఆదుకున్నందుకు భారత ప్రజలకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది.

ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతున్న దాడుల వల్ల ఇరాన్‌లో తీవ్రమైన మానవతా సంక్షోభం నెలకొంది. వేలాది మంది పౌరులు గాయపడగా, ఆసుపత్రుల్లో అత్యవసర మందులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్పందించిన భారత్, తొలి విడత వైద్య సామాగ్రిని పంపింది. ఈ సహాయాన్ని అక్కడి ‘ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ’ అందుకుంది. ఈ విషయాన్ని న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘‘భారత ప్రజలు పంపిన తొలి విడత వైద్య సాయం ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి చేరింది. దయార్ద్ర హృదయులైన భారత ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని పేర్కొంది.

ఇరాన్‌లోని పౌరులకు మానవతా సాయం అందించే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు భారత విదేశాంగ శాఖ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఆ చర్చలు ఫలించి, ఇప్పుడు సాయం చేరడం గమనార్హం. భారత్‌తో పాటు చైనా, అజర్‌బైజాన్, రష్యా వంటి దేశాలు కూడా ఇరాన్‌కు సహాయాన్ని అందిస్తున్నాయి. యుద్ధం కారణంగా చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

Iran
Iran crisis
India humanitarian aid
medical assistance
Iranian Red Crescent Society
India Iran relations
humanitarian crisis
medicine shortage
Israel attacks
America attacks

More Telugu News